వైఎస్సార్ వాహన మిత్ర రెండో ఏడాది ప్రారంభం
By: chandrasekar Fri, 05 June 2020 7:06 PM
తాడేపల్లి క్యాంపు
కార్యాలయం నుంచి ‘వైఎస్సార్ వాహన మిత్ర’కు సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీకారం
చుట్టారు. కరోనా, లాక్డౌన్తో
ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే
ఆర్థిక సాయం కింద రూ.10వేలు
అందించారు. మొత్తం రూ.262.495 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి.
మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు చేశారు. కరోనా, లాక్డౌన్
వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కోసం నాలుగు నెలల
ముందుగానే సాయం అందించామన్నారు సీఎం జగన్. డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా
లబ్దిదారులకు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు.
అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే
దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. డ్రైవర్లు కూడా ఆటోలు, వాహనాలను మంచి కండిషన్లో ఉంచుకోవాలని మద్యం సేవించి
వాహనాలు నడపొద్దని సూచించారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని
వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి
ఈ ఏడాది మే 16 వరకు
వాహనాల కొనుగోలు, యాజమాన్య
బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. కొత్తగా ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 849 దరఖాస్తులు సరైన డాక్యుమెంట్లు లేక తిరస్కరించగా 37,756 మంది కొత్తగా ఎంపికయ్యారు.
గత ఏడాది 2,39,957 మందికి లబ్ధి చేకూరగా కొంతమంది వాహన యాజమాన్య
హక్కులు బదిలీ చేసుకున్నారు. గ్రామాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి లబ్ధిదారుల్ని
నిర్ధారించారు. ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ‘వైఎస్సార్
వాహన మిత్ర’పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ డబ్బును వాహనాల
ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవచ్చు. ఆఫ్లైన్లోనూ
దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించారు.