ఆంధ్రాలో జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
By: chandrasekar Wed, 24 June 2020 5:19 PM
రాష్ట్రవ్యాప్తంగా
అర్హులైన వారందరికీ జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 29- 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు
వెల్లడించారు. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమమని అన్నారు.
మంగళవారం ముఖ్యమంత్రి
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇళ్లపట్టాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ
సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల
అభివృద్ధిపై నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. నూటికి నూరు శాతం
ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్లాట్ల
కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలన్నారు.
ఇళ్ల పట్టాల లబ్ధిదారుల
తుది జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, కోవిడ్ పరిస్థితులు
తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. తాను
పర్యటించినప్పుడు ఏ ఒక్కరూ ఇంటి పట్టా లేదని చేయి ఎత్తకూడదని సీఎం వైఎస్ జగన్
స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం జగన్
ఆదేశించారు.
సరైన కారణంగా లేకుండా
ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అర్హత
ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా
అర్హులైతే ఇళ్ల పట్టా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
పెన్షన్ కార్డుకు 10
రోజులు, రేషన్
కార్డుకు 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటి
పట్టా 90
రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలన్నారు. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను
తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వివక్ష లేకుండా, సంతృప్త
స్థాయిలో అందాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.