తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ స్టోరీ రైటర్ కరోనా వల్ల మృతి
By: chandrasekar Fri, 13 Nov 2020 10:44 AM
తెలుగు చిత్ర పరిశ్రమలో
యంగ్ స్టోరీ రైటర్ కరోనా వల్ల మృతి చెందారు. చిన్న వయసులోనే కరోనా వల్ల మృతి
చెందడంతో అందరూ దిగ్బ్రాంతికి గురైయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో
మందిని పొట్టన పెట్టుకుంది. సినిమా పరిశ్రమలో కూడా ఇప్పటికే చాలామంది కరోనా బారిన
పడి కన్నుమూశారు. గాన గంధర్వుడు
బాలసుబ్రహ్మణ్యం కూడా ఇటీవలే మనకు దూరమయ్యారు. ఆయనతో పాటు టాలీవుడ్ నిర్మాత
పోకూరి రామారావు, మర్యాద రామన్న నటుడు వేణు గోపాల్ కూడా ఈ
మహమ్మారి బారిన పడి మరణించారు. బాలీవుడ్లో
కూడా చాలామందిని కరోనా వైరస్ తీసుకెళ్ళిపోయింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సాజిద్
ఖాన్ కూడా కరోనా బారిన పడి మరణించాడు. చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 43 ఏళ్లు
మాత్రమే. ఇక ఇప్పుడు మరో యువ రచయిత
కూడా కరోనా వైరస్ తో చనిపోయాడు. టాలీవుడ్
స్టోరీ రైటర్ 'వంశీ రాజేష్' కరోనా కారణంగా తుది శ్వాస విడిచాడు. గత కొన్ని
రోజులుగా కరోనాతో పోరాడుతున్నాడు. ఆయన రెండు మూడు వారాలుగా హాస్పిటల్ లో చికిత్స
తీసుకుంటున్నాడు.
ఈ యువ రచయిత వంశీ రాజేష్
మూడేళ్ల కింద రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాకు రచయితగా పని
చేసాడు. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా ఆయన కథా రచయితగా పనిచేశాడు. త్వరలోనే దర్శకుడు కావాలని స్టోరీ కూడా వంశీ
రాజేష్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో ఆయన కరోనా బారిన పడి మరణించాడు.
కోలుకుంటున్నట్లు కనిపించినా కూడా ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు
తెలిపారు. వంశీ రాజేష్ మృతికి టాలీవుడ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు
ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇంత చిన్న వయసులోనే వంశీ రాజేష్ మరణించడం తోటి
రచయితలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న యంగ్ టాలెంట్
కరోనా వైరస్ బారిన పడి కన్ను మూసినందున వాళ్లు ఆవేదన చెందుతున్నారు. ఆయన ఆత్మకు
శాంతి కలగాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలుగు చిత్ర
పరిశ్రమలు తీవ్ర కలకలం రేపింది.