సోషల్ మీడియాలో తన ఫోటోలకు లైక్స్ రావడం లేదు అని యువతీ ఆత్మహత్య
By: Sankar Sun, 23 Aug 2020 1:16 PM
ఇటీవల కాలంలో యువత సోషల్మీడియాకు బాగా అలవాటు పడిపోతోంది. బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లతో కాలం గడిపేస్తున్నారు. అతిగా సోషల్మీడియా వినియోగిస్తే మానసికంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాగే ఫేస్బుక్ వాడకాన్ని వ్యసనంగా మార్చుకున్న 19ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంగ్లండ్లోని లాంచెస్టర్లో జరిగింది.
నగరానికి చెందిన క్లోయె డేవిసన్(19) అనే యువతి కొద్ది నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆమె ఆత్మహత్యకు ఎలాంటి కారణం వెలుగులోకి రాలేదు. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె స్నేహితురాలు అసలు నిజాన్ని బయటపెట్టడంతో అందరూ షాకయ్యారు
క్లోయె అందంగా ఉండేది. చదువుకుంటూనే ఓ హోటల్లో పనిచేసేది. తరుచూ ఫోటోలు తీసుకుని వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేది. వాటికి పెద్దగా లైకులు రాకపోవడంతో తనను ఎవరూ ఇష్ట పడటం లేదని స్నేహితుల వద్ద ఆవేదన చెందేది. ఓ రోజు అందంగా రెడీ అయి సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దానికి ఎవరూ లైకులు కొట్టకపోవడంతో డిప్రెషన్కు గురై ఆత్మహత్య చేసుకుంది.