Advertisement

  • ఫైబర్ నెట్‌కు సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీల డిమాండ్

ఫైబర్ నెట్‌కు సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీల డిమాండ్

By: chandrasekar Thu, 24 Sept 2020 5:10 PM

ఫైబర్ నెట్‌కు సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీల డిమాండ్


అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ టార్గెట్‌ చేసి కేంద్ర ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. అమరావతి, ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు గోరంట్ల మాధవ్‌, డాక్టర్ సంజయ్ కుమార్, తలారి రంగయ్య పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, అమరావతిపై సీబీఐ దర్యాప్తు, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు.

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైందనే పేరుతో రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైలు తగులబెట్టి కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒక ద్రోహి అని ఎంపీలు మండిపడ్డారు. నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. హద్దుమీరి మాట్లాడితే తన బండారం బయట పెడతామని హెచ్చరించారు. తమ నాయకుడిని విమర్శిస్తే ఊరుకోబోమని, కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే ఎందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించారు. కాగా, ఏపీలో ప్రస్తుతం ఫైబర్ నెట్‌కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందంటూ అధికార పక్షం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరడం గమనార్హం. ఇందులో లోకేష్ పాత్ర ఉందని, ఆయనపై కఠిన చర్యలు తప్పవంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement