అత్యంత ఘోరంగా జరిగిన కరోనా వైరస్ సోకిన వ్యక్తి అంత్యక్రియలు
By: chandrasekar Sat, 27 June 2020 2:44 PM
శ్రీకాకుళం జిల్లా ఓ
వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణిస్తే అతడి అంత్యక్రియలు అత్యంత ఘోరంగా చేశారు. ఓ
ప్రొక్లెయిన్లో శవాన్ని తీసుకుని వెళ్లి పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో
వైరల్గా మారి పెద్ద దుమారానికి దారి తీసింది.
ఈ ఘటనలో ఇద్దరు ప్రభుత్వ
అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పలాస ఘటన గురించి తెలిసిన తర్వాత సీఎంవో
అధికారులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కరోనాతో చనిపోయిన వారి విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్పష్టమైన ప్రోటోకాల్
ఉంది. కానీ, దాన్ని ఉల్లంఘించి పొక్లెయిన్ద్వారా మృతదేహాన్ని
తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు.
బాధ్యులపై వెంటనే చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ నివాస్, పలాస
మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్ను సస్పెండ్
చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు.
కరోనాతో వ్యక్తి మరణిస్తే
ఆ డెడ్ బాడీని కవర్లో చుట్టి జేసీబీ, ట్రాక్టర్లో తరలించడం చూసి షాక్కు గురయ్యానన్నారు.
మరణంలో కూడా వారికి కనీసం మర్యాద ఇవ్వకపోవడం దారుణమన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈ
ఘటనను చూసి సిగ్గు పడాలని తెలిపారు. కరోనాతో ఎవరైనా చనిపోతే వారిని ఎలా అంతిమ
సంస్కారాలు నిర్వహించాలనే అంశంపై గతంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
చేసింది.
కరోనా సోకిన వారి
విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్యారోగ్యశాఖ ఇదివరకే
స్పష్టమైన నిబంధనలను జారీచేసి ఈసందర్భంగా ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది. గతంలో
కర్నూలు జిల్లాలో కూడా కరోనాతో ఓ వ్యక్తి చనిపోతే అతడి అంత్యక్రియలను స్థానికులు
అడ్డుకున్నారు. తమ గ్రామంలో అంత్యక్రియలు వద్దని హెచ్చరించారు. ఈ ఘటన పెద్ద దుమారం
రేపింది. దీనిపై సీఎం జగన్ కూడా స్పందించారు. అంత్యక్రియలను అడ్డుకుంటే
ఊరుకోవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.