Advertisement

ఆమె ఫిర్యాదు చూసి పోలీసులే కంగుతిన్నారు

By: Anji Thu, 17 Sept 2020 12:18 PM

ఆమె ఫిర్యాదు చూసి పోలీసులే కంగుతిన్నారు

కర్ణాటకలోని హసన్ జిల్లాలో గత నెల 27న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వెళ్తున్న యువకుడిని చన్నరాయపట్టణ ఏరియా బెడిగనహళ్లి చెరువు వద్ద గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి మృతుడిని పునీత్‌(26)గా గుర్తించారు. కొడుకుని చంపేశారని తెలుసుకున్న అతని తల్లి పోలీసులకు షాకింగ్ కంప్లైంట్ ఇచ్చింది.

ఆమె ఫిర్యాదు చూసి పోలీసులే కంగుతిన్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...చెన్నరాయపట్టణ ఏరియాకి చెందిన పునీత్‌కి తన తండ్రి హేమంత్‌తో కొద్దికాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో వైరం కొనసాగుతోంది. దీంతో కొడుకుపై కోపం పెంచుకున్న తండ్రి కొడుకు అడ్డుతొలగించుకున్నాడని.. కనీస కనికరం లేకుండా హత్య చేయించాడంటూ తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాకయ్యారు. తీరా ఆ దిశగా విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కడుపున పుట్టిన బిడ్డను చంపేందుకు కసాయి తండ్రి కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకున్నాడు. సుపారీగా రెండు లక్షల రూపాయల ముట్టజెప్పాడు.

పునీత్ హత్యకి సుపారీ తీసుకున్న గ్యాంగ్ అదనుకోసం ఎదురుచూసింది. ఒంటరిగా వస్తున్నాడని తెలుసుకున్న కిరాయి హంతకుల ముఠా సభ్యులు బెడిగనహళ్లి చెరువు వద్ద మాటు వేశారు. బైక్‌పై వస్తున్న పునీత్‌ని అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్లు శరీరంలో నుంచి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే నేలకొరిగాడు. తన భర్తే కొడుకుని హత్య చేయించాడంటూ మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కన్నతండ్రినే హత్యకు సూత్రధారిగా గుర్తించారు. సుపారీ గ్యాంగ్ సభ్యులు కాంతరాజు, ప్రశాంత్, సునీల్, నందీశ, నాగరాజ్‌‌లతో సహా ప్రధాన నిందితుడు, మృతుడి తండ్రి హేమంత్‌ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Tags :

Advertisement