కర్ణాటకలో దారుణం ..భర్తను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య
By: Sankar Mon, 07 Sept 2020 7:48 PM
వివాహేతర సంబంధాలు ఎంత దారుణాలకు దారితీస్తాయి ఈ ఘటన చూస్తే తెలుస్తుంది..కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా నిప్పానిలోని హంచనల గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో పడిన ఓ యువతి భర్తను దారుణంగా హత్యచేసింది. అనంతరం జేసీబీ గొయ్యి తీయించి పాతిపెట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. సచిన్-అనితకు కొన్నేండ్ల క్రితం పెళ్లయింది. అయితే అనితకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం సచిన్కు తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయమై గత గురువారం రాత్రి కూడా భర్త, భార్య గొడవపడ్డారు. గొడవ ముదరడంతో అనిత తన భర్త సచిన్ను కర్రతో కొట్టి చంపింది.
అనంతరం ఈ నేరం ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. తన గేదె చనిపోయిందని చెప్పి దాని కళేబరాన్ని పూడ్చడం కోసం గొయ్యి తీయాలని జేసీబీని పిలిపించింది. అనంతరం తన సోదరి, సోదరుడు, మరో వ్యక్తి సాయంతో మృతదేహాన్ని తీసుకెళ్లి ఆ గొయ్యిలో వేసి పూడ్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.