ప్రపంచం మరింత కష్టకాలాన్ని ఎదుర్కోనుంది ..కరోనా పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు
By: Sankar Mon, 05 Oct 2020 9:59 PM
ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. మరెంతో మంది కరోనా సంబంధిత రోగాలతో సతమతమవుతున్నారు. తమ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో పది శాతం మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సోమవారం తెలిపింది.
అయితే దేశాలు, ప్రాంతాలపరంగా ఇందులో వ్యత్యాసం ఉన్నదని చెప్పింది. మొత్తం మీద ప్రపంచంలోని మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉన్నదని హెచ్చరించింది.కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నదని, ప్రపంచం మరింత కష్టకాలన్ని ఎదుర్కోనున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆ సంస్థ టాప్ ఎమర్జెన్సీ ఎక్స్పర్ట్ మైక్ ర్యాన్ ఈ మేరకు తెలిపారు.
ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యధరా ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. మరోవైపు కరోనా వ్యాప్తికి మూలమైన చైనాలో దర్యాప్తు కోసం అంతర్జాతీయ మిషన్లో పాల్గొనే నిఫుణుల జాబితాను ఆ దేశ ఆమోదం కోసం డ్లబ్యూహెచ్ఓ పంపినట్లు మైక్ ర్యాన్ వెల్లడించారు.