ఆ వయస్సు దాటిన పిల్లలు కూడా పెద్దవారివలె తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
By: Sankar Sun, 23 Aug 2020 2:39 PM
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే భౌతికదూరం నిబంధన సహా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పిల్లలు మాస్క్లు ధరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ పిల్లలు మాస్క్లు ధరించడంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా గైడ్లైన్స్ ప్రకారం.. 12 ఏళ్లు దాటిన పిల్లలు కూడా పెద్దల మాదిరిగానే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 12 ఏళ్లు దాటిన చిన్నారులకు పెద్దల మాదిరిగానే కరోనా వచ్చే ముప్పు ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఐదేళ్లలోపు చిన్నారులు మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని, వీరికి కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని స్పష్టం చేసింది. కానీ, 6 నుంచి 11 ఏళ్లోపు పిల్లలు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కానీ, చిన్నారులు ఆటలాడుకునే సమయంలో మాస్కులు ఉపయోగించవద్దని సూచించింది. అయితే, ఆడుకునేటప్పుడు ఆట స్థలంలో పరిమిత సంఖ్యలోనే ఉండి, పిల్లలు భౌతికదూరం పాటించాలని తెలిపింది