ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరు...?
By: chandrasekar Wed, 25 Nov 2020 7:50 PM
మహేంద్ర సింగ్ ధోనీ
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక అతడి స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్
బ్యాట్స్మెన్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. రిషబ్ పంత్ నంబర్ వన్ ఛాయిస్ ఆటగాడు
అయినప్పటికీ బ్యాటింగ్లో నిలకడ లేక
పోవడంతో అది అతడికి శాపమైంది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్..
టెస్టుల్లో వృద్ధిమాన్ సాహాకు వికెట్ కీపింగ్ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. టీ20ల్లో
దూకుడుగా ఆడే సంజూ శాంసన్ కూడా వికెట్ కీపర్ రేసులో ఉన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో
వన్డే సిరీస్కు ముందు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రస్తుత భారత
క్రికెట్లో ఇద్దరు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లెవరో వెల్లడించాడు. ఐపీఎల్ 2020లో
ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్ను దాదా వెనకేసుకొచ్చాడు. పంత్, సాహా
ఇద్దరూ మన బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని గంగూలీ పేర్కొన్నాడు.
ఐపీఎల్లో పంత్ తన
సహజసిద్ధమైన ఆటతీరు కనబర్చలేకపోయినా అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉందని కచ్చితంగా
జట్టులోకి వస్తాడని దాదా విశ్వాసం వ్యక్తం చేశాడు. పంత్ యువ ఆటగాడని అతడికి సలహాలు, సూచనలు
అవసరమని పేర్కొన్నాడు. టెస్టు సిరీస్లో పంత్కు ఆడే అవకాశం కల్పిస్తారా అని
ప్రశ్నించగా సాహా మెరుగైన వికెట్ కీపర్ అని.. బ్యాటింగ్లోనూ ఫామ్లో ఉన్నాడని..
ఎవరు మంచి ఫామ్లో ఉంటే వారు ఆడుతారనడం ద్వారా సాహాకే ఛాన్స్ ఉందని పరోక్షంగా
చెప్పాడు. నవంబర్ 27న ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్లో పంత్కు
చోటు దక్కలేదు. దీంతో కేఎల్ రాహుల్, సంజూ
శాంసన్లను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఎంపిక చేశారు.