యూఏఈ చేరుకున్న కరేబియన్ వీరులు
By: Sankar Sun, 13 Sept 2020 10:36 AM
ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ గడ్డపై వెస్టిండీస్ క్రికెటర్లు శనివారం అడుగుపెట్టారు. గత గురువారం రాత్రి వరకూ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన విండీస్ ఆటగాళ్లు.. కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, అలీ ఖాన్, సునీల్ నరైన్, రూథర్ ఫర్డ్ తదితరులు ఈరోజు యూఏఈకి చేరుకుని టీమ్స్ బస చేసిన హోటల్స్లో దిగారు. విమాన ప్రయాణం చేసి ఉన్నందున.. ఆరు రోజుల పాటు వారు క్వారంటైన్లో ఉండనున్నారు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. ఈరోజు నుంచి ఆరు రోజుల పాటు వెస్టిండీస్ క్రికెటర్లు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ ఆరు రోజుల్లోనే వారికి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనుండగా.. మూడింట్లోనూ నెగటివ్ వస్తేనే బబుల్లోకి ఎంట్రీ ఉంటుంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో కెప్టెన్గా ట్రిన్బాగో నైట్రైడర్స్ టీమ్ని విజేతగా నిలిపిన కీరన్ పొలార్డ్.. 207 పరుగులు చేసి మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. దాంతో.. ముంబయి ఇండియన్స్ టీమ్ అతడ్ని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.