సిరీస్ విజయం దిశగా ఇంగ్లాండ్ ..ఓటమి అంచుల్లో విండీస్
By: Sankar Mon, 27 July 2020 08:47 AM
వెస్ట్ ఇండీస్ , ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం దిశగా సాగుతుంది ..ఈ సిరీస్ లో తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలయిన ఇంగ్లాండ్ బలంగా పుంజుకుంది ..రెండో టెస్టులో విజయం సాధించి , మూడో టెస్టులో విజయం వైపుగా దూసుకెళ్తుంది ..చివరిదైన మూడో టెస్టులో విజయం కోసం 399 పరుగులు చేయాల్సిన విండీస్ మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసి ఎదురీదుతోంది. బ్రాత్వైట్ (2 బ్యాటింగ్), హోప్ (4 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ను 2 వికెట్లకు 226 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రోరీ బర్న్స్ (90; 10 ఫోర్లు), జో రూట్ (68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), డామ్ సిబ్లీ (56; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓవర్నైట్ స్కోరు 137/6తో ఆట కొన సాగించిన విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్కు 172 పరుగుల ఆధిక్యం లభించింది. బ్రాడ్ 6 వికెట్లతో చెలరేగాడు.విండీస్ తమ చివరి 4 వికెట్లను 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది. ఈ నాలుగూ బ్రాడ్ ఖాతాలోకి వెళ్లాయి.
ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను బర్న్స్, సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. ముందుగా సిబ్లీ 121 బంతుల్లో, బర్న్స్ 111 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. ఎట్టకేలకు 114 పరుగుల శతక భాగస్వామ్యం తర్వాత సిబ్లీని అవుట్ చేసి హోల్డర్ ఈ జోడిని విడగొట్టాడు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ రూట్ దూకుడు ఆడి 49 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. మరోవైపు శతకానికి చేరువైన బర్న్స్... ఛేజ్ బౌలింగ్లో స్లాగ్స్వీప్కు ప్రయత్నించి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ డిక్లేర్ చేసింది.