Advertisement

కోవిడ్ నివారణ కు సర్వసన్నద్ధం

By: Dimple Wed, 15 July 2020 5:35 PM

కోవిడ్ నివారణ కు సర్వసన్నద్ధం


కోవిడ్‌–19ను ఎదుర్కొనేందుకు భవిష్యత్‌ అవసరాల కోసం 17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులను సిద్ధం చేసేలా రూపొందించిన ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. విపత్తు సమయంలో సేవలందిస్తున్న వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధం చేశామన్నారు. కనీసం 17 వేల మందికి పైగా డాక్టర్లు, 12 వేల మందికి పైగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. దీని అమలుకు వైఎస్‌ జగన్‌ అక్కడికక్కడే అంగీకారం తెలిపారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

ప్రజల్లో అవగాహన కల్పించాలి
*ఎవరికైనా కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం ఉండాలి. ఈ మేరకు స్పష్టమైన ప్రొటోకాల్‌ ఉండాలి. ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్‌ను విస్తృతంగా ఏర్పాటు చేయాలి. ఎస్‌ఓపీ (స్టాండర్డ్ఆపరేషన్‌ ప్రొసీజర్‌) ప్రకారం పరీక్షలు చేయాలి. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలి.
* కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని అధికారులు వివరించారు. హైరిస్క్‌ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని చెప్పారు.
* టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణించి వైద్యం అందిస్తున్నామని వివరించారు. పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆసుపత్రికి వస్తుండడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీఎంకు వివరించారు.
* సమీక్షకు ముందు రాష్ట్రంలోకోవిడ్‌పరీక్షలు, కేసుల తీరును అధికారులు వెల్లడించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య) ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

క్వారంటైన్‌సెంటర్లపైఫోకస్‌పెంచాలి
* క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలి. ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలి.* కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. అందుకు ఎలాంటి మార్పులు అవసరమైనా చేయాలి. క్రమం తప్పకుండా ఆసుపత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలి.
* మనం దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యం. చేసే పనుల్లో నాణ్యత లేకపోతే మనం ఫలితాలు సాధించలేం.
* కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. చికిత్స పొందుతున్న వారికి జీఎంపీ (గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలున్న మందులు అందాలి. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలి.

నేడు కేబినెట్‌ భేటీ
సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇసుక సరఫరాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.

Tags :
|

Advertisement