Advertisement

  • చక్కటి ఆతిథ్యమిచ్చిన ఈసీబీ...రూ.100 కోట్లు చెల్లించిన బీసీసీఐ...

చక్కటి ఆతిథ్యమిచ్చిన ఈసీబీ...రూ.100 కోట్లు చెల్లించిన బీసీసీఐ...

By: chandrasekar Mon, 16 Nov 2020 12:09 PM

చక్కటి ఆతిథ్యమిచ్చిన ఈసీబీ...రూ.100 కోట్లు చెల్లించిన బీసీసీఐ...


ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)‌‌ ఐపీఎల్ 2020 సీజన్‌కి చక్కటి ఆతిథ్యమిచ్చి౦ది. ఇందు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి రూ.100 కోట్లు చెల్లించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణకి బీసీసీఐ వెనుకంజ వేయగా.. తాము ఆతిథ్యమిస్తామని ఈసీబీ తొలుత ముందుకు వచ్చింది. ఆ వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ప్రపోజల్‌ని తెచ్చినా.. అన్ని వసతులూ మెండుగా ఉన్న యూఏఈ వైపే బీసీసీఐ ఆసక్తి చూపింది. దాంతో.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగగా డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్ ఐదోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి 14 రోజుల ముందే యూఏఈకి అన్ని జట్లు చేరుకోగా.. క్వారంటైన్, కరోనా వైరస్ టెస్టులు, బస, ప్రయాణ ఏర్పాట్లు విషయంలో బీసీసీఐతో ఈసీబీ చక్కటి సమన్వయం కనబర్చింది. షార్జా, అబుదాబి, దుబాయ్ రూపంలో కేవలం మూడు స్టేడియాల్లోనే టోర్నీ మొత్తం (60 మ్యాచ్‌లు) నిర్వహించినా ఎలాంటి ఇబ్బందులు రానివ్వలేదు.

ముఖ్యంగా.. పిచ్‌ల రూపకల్పనలో అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈసీబీ. దాంతో.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ 2020 సీజన్ అత్యుత్తమ సీజన్‌గా నిలిచింది. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన జట్టు కూడా 12 పాయింట్లు సాధించగా.. లీగ్ దశ చివరి మ్యాచ్ వరకూ మూడు ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రాలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగగా.. స్టేడియంలోకి ప్రేక్షకుల్ని చివరి వరకూ అనుమతించలేదు. సెక్యూరిటీ విషయంలోనూ ఈసీబీ చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మొత్తంగా 2014లో 20 ఐపీఎల్ మ్యాచ్‌లకే ఆతిథ్యమిచ్చిన యూఏఈ.. ఈ ఏడాది అన్ని మ్యాచ్‌లకి ఆతిథ్యమిచ్చి బీసీసీఐ మన్నలని అందుకుంది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్‌ ఈ ఏడాది జరగకపోయుంటే..? బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోయేది.

Tags :
|
|

Advertisement