తెలంగాణాలో బుధవారం రికార్డు కరోనా కేసులు నమోదు
By: Sankar Thu, 18 June 2020 11:57 AM
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 269 పాజిటివ్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కేసు వెలుగచూసిన తర్వాత 24గంటల వ్యవధిలో ఈ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. బుధవారం 1096 శాంపిల్స్ పరీక్షిస్తే 13 జిల్లాల్లో 269 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 214 మంది ఉన్నారు. రాజధాని పరిధిలో 200కు పైగా కేసులు నమోదవ్వడం కూడా ఇదే తొలిసారి. రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్లో 10, కరీంనగర్లో 8, జనగాం, ములుగులో ఐదుగురు చొప్పున, మెదక్, సంగారెడ్డిలో ముగ్గురుచొప్పున, వనపర్తి, మేడ్చల్, జిల్లాల్లో ఇద్దరు చొప్పున, వికారాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, భూపాలపల్లి జిల్లాల్లో ఒకరి చొప్పున వైరస్ బారినపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా గత ఐదురోజుల్లోనే 1191 మందికి పాజిటివ్ వచ్చింది. ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడు రోజుల్లోనే 521 పాజిటివ్లు తేలాయి.బుధవారం వైర్సతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరణాల సంఖ్య 192కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5675కు చేరింది. బుధవారం వైరస్ నుంచి మరో 151 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3071 మంది కరోనా నుంచి బయటపడగా, 2412 యాక్టివ్ కేసులున్నాయి
టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కరోనా వైరస్ సోకింది. బుధవారం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. వెంటనే ఆయన అదే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా గూడూరు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఒళ్లు నొప్పులు, రుచి, వాసన తెలియక పోవడం వంటి ప్రాథమిక లక్షణాలు కనపడటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.ప్రాథమిక దశలోనే ఆస్పత్రిలో చేరినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరగా నయమవుతుందని తనకు వైద్యులు చెప్పినట్లు నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా.. సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని చెప్పేందుకు తన కేసే ఉదాహరణ అని గూడూరు తెలిపారు. తనకు ఇటీవలి కాలంలో ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని, కొవిడ్ -19 రోగితోగానీ, వారి దగ్గరి పరిచయాలతో కానీ ఎటువంటి కాంటాక్టులూ తనకు లేవన్నారు.