నివర్ తుఫాన్ వల్ల ఆగిన పెళ్లి
By: chandrasekar Sat, 28 Nov 2020 2:49 PM
గత మూడు రోజులుగా నివర్
తుఫాను పెను ముప్పును ఏర్పరిచింది. నివర్ తుఫాన్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాను వణికించింది. భారీ వర్షాలకు
వాగులు, వంకలు
పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం
అయ్యాయి. ఇదిలా ఉంటే నివర్ తుఫాన్ ప్రభావంతో ఓ పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది.
వివరాలు చూస్తే పెద్దమండ్యం మండలం పాపేపల్లె వద్ద వాగును పెళ్లి కూతురుతో పాటు
బంధుమిత్రులు దాటి కళ్యాణ మండపానికి వెళ్ల లేక వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. వరుడి బంధువులు చెప్పిన వివరాల మేరకు
పాపేపల్లెకు చెందిన యువతికి బి.కొత్తకోట మండలం దేవరాజుపల్లెకు చెందిన యువకుడికి
పెళ్లి కుదిరింది. శుక్రవారం వేకువజామున ఐదు గంటలకు ఈ వివాహ వేడుకకు ముహూర్తం
పెట్టారు.
ఈ వివాహాన్ని
నిర్వహించడానికి గట్టులోని శ్రీవెంకటరమణస్వామి కల్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు
చేశారు. గురువారం రాత్రి రిసెప్షన్కు ఏర్పాటు చేయగా పాపేపల్లె నుంచి పెళ్లి
కూతురు బంధువులు బయల్దేరి వెళ్లారు.
గురువారం మధ్యాహ్నం బంధువులతో కలిసి రెండు బస్సుల్లో గట్టుకు బయలుదేరేందుకు
సిద్ధమయ్యారు. ఈలోగా కుండపోత వానలు కురవడంతో పాపేపల్లె వద్ద ఉన్న వాగుకు వరద
పోటెత్తింది. ఇందువల్ల ఆ దారిన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం
ఉదయానికి కూడా పాపేపల్లె వాగు జోరు తగ్గకపోవడంతో పెళ్లి పెద్దలు ఫోన్ ద్వారా
మాట్లాడి పెళ్లిని వాయిదా వేశారు. మరో ముహూర్తానికి వివాహం చేయాలని నిర్ణయించినట్లు
తెలుస్తోంది. నివర్ తుఫాను వల్ల చాలా మంది బాధించబడ్డారు.