ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు నేటి నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్స్
By: Sankar Tue, 15 Dec 2020 8:10 PM
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మంగళవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్శిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు మైనార్టీ, నాన్మైనార్టీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా బీ, సీ( ఎన్ ఆర్ ఐ ) క్యాటగిరీ సీట్ల భర్తీకి ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.
ధ్రువపత్రాలు పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాల వారీగా ఈ నెల 15 సాయింత్రం 4 గంటల నుంచి 17 సాయింత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు.
ఇక మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులో మార్పేమి లేదని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020-21 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య, దంత కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యుజి) మెడికల్, డెంటల్ కోర్సులకు ప్రస్తుతం ఉన్న ఫీజు విధానమే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవలే తెలంగాణ రాష్ర్ట అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజు స్ర్టక్చర్(2020-2023)కు సంబంధించి సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.