ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తాం: కేసీఆర్
By: chandrasekar Fri, 17 July 2020 09:50 AM
తెలంగాణ సీఎం
కేసీఆర్ విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో
ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన
దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేస్తామని ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ
నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్
తదితర విషయాలపై యుజిసి,ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని
నిర్ణయించారు.
కరోనా నేపథ్యంలో
విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం
చేసే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో విస్తృత
స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును
గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య
పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్
అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి
క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నామన్న
కేసీఆర్ ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్
కాలేజీలు, డిగ్రీ
కాలేజీలు, ఇతర
ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు
తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే
విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల
అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యావ్యవస్థ
పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్
ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని.. మిగతా వారినిపై తరగతులకు
ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు.
ఆగస్టు 17నుంచి
ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు
విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం
రూపొందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన
ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు
అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే
తుది నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు.