ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు కోచ్ గా వసీం జాఫర్ నియామకం
By: Sankar Tue, 23 June 2020 5:50 PM
వసీం జాఫర్ ..అంతర్జాతీయ స్థాయిలో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో ఆల్ టైం గ్రేట్ ఆటగాళ్లలో ఒకడు ..టన్నుల కొద్దీ పరుగులు , సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ..అయితే ఇటీవలే డొమెస్టిక్ క్రికెట్నుంచి వైదొలిగిన జాఫర్ వెంటనే ఉత్తరాఖండ్ జట్టుకు కోచ్ గా నియమితుడయ్యాడు ..ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు ..ఏడాది పాటు ఉత్తరాఖండ్ జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేయనున్నట్లు పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికాక మొదటిసారి కోచ్గా పనిచేయనున్న జాఫర్ తన అంతరంగాన్ని పంచుకున్నాడు.
నేను మొదటిసారి ఒక జట్టుకు కోచ్గా పనిచేయబోతున్నా. ఈ పదవి నాకు ఇప్పుడు కొత్తగాను, ఒక చాలెంజింగ్ అనిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక ఆటగాడిగా సేవలందించిన నేను ఇక జట్టును తీర్చిదిద్దేపనిలో ఉండడం అదృషంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్ జట్టు నాకు కొత్తైనా వారి ప్రదర్శన మాత్రం బాగానే ఉంది. 2018-19 రంజీ సీజన్లో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లో విదర్భతో తలపడి ఓడిపోయింది. ప్రస్తుతం గ్రూఫ్-డిలో ఉన్న ఉత్తరాఖండ్ జట్టును టాప్లో నిలపడమనేది నా ముందున్న సవాల్ అని ఈ దిగ్గజ ఆటగాడు అన్నాడు ..
ఇప్పుడున్న తరుణంలో జట్టును కింద నుంచి పైస్థానానికి తీసుకురావడం అనేది కోచ్గా అనుభవాన్ని నేర్పిస్తుంది. జట్టులో మంచి టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారిని మరింత రాటు దేల్చడమే నా లక్ష్యం. స్వతహగా నేను ముంబై, విదర్భ జట్లకు ఆడేటప్పుడు ఉత్తరాఖండ్ జట్టును పరిశీలించాను. గత ఐదారేళ్లలో క్రికెట్లోకి వచ్చిన ఎంతో మంది యువకులకు ఆటలో మెళుకువలు ఇస్తూ వారికి మార్గ నిర్దేశనం చేశా. ప్రస్తుతం కోచ్ అవకాశం రావడంతో మరింత మంది యువకులకు నా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అంటూ పేర్కొన్నాడు.
ఇక టీమిండియా తరుపున సుదీర్ఘ ఫార్మాట్లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు.కాగా రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్ ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.