క్రికెట్ లో 22000 పరుగులు పూర్తి చేసుకున్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ
By: Sankar Sun, 29 Nov 2020 7:36 PM
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఫామ్లో కనిపించిన రన్మెషీన్ కోహ్లీ అద్భుత అర్ధసెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. గత ఆరు-ఏడేండ్ల నుంచి పరుగుల వరదపారిస్తూ వచ్చిన విరాట్ జట్టుకు ఎన్నో విజయాలన్నందించాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ సగటు 50కి పైనే కావడం విశేషం.
ఆసీస్తో మ్యాచ్లో వ్యక్తిగత స్కోరు 86 పరుగులు పూర్తి చేయగానే ఇంటర్నేషనల్ కెరీర్లో కోహ్లీ 22వేల పరుగుల మార్క్ను చేరుకున్నాడు. క్రికెట్ చరిత్రలో 22వేల పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాట్స్మన్ విరాటే కావడం విశేషం. అలాగే, ఆస్ట్రేలియాపై వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
కోహ్లీ 40 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, రోహిత్శర్మ ఉన్నారు. ఇక 250 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడిన తొమ్మిదో భారత క్రికెటర్గా నిలిచాడు. ఆదివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో ఆడుతున్న వన్డే మ్యాచ్తో కోహ్లి 250 మ్యాచ్ల మైలురాయిని చేరుకున్నాడు.