- హోమ్›
- వార్తలు›
- బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
By: chandrasekar Mon, 23 Nov 2020 11:50 AM
జీహెచ్ఎంసీ ఎన్నికల
ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ బీజేపీ పై
ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డంపెట్టుకొని బీజేపీ దుర్మార్గపు, విషపూరిత
దుష్ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్
ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం
వివేకానందనగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పబ్బం గడుపుకొనేందుకు బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని
ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇక్కడ బీజేపీ నాయకులు మత
మౌఢ్యంతో చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. మతం అనేది వ్యక్తిగత విషయమని, ఓట్ల
కోసం మత విశ్వాసాన్ని రెచ్చగొడుతున్నారని, మతానికి, రాజకీయాలకు ముడిపెట్టడం బీజేపీ నాయకుల దుర్మార్గానికి
పరాకాష్ఠ అని అన్నారు. మత రాజకీయాలు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హితవుపలికారు.
ప్రధాని మోదీ నిజమైన దేశభక్తుడు అయితే జాతి సంపదను కాపాడాలని, కానీ
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థలను ఎందుకు అమ్ముతున్నారని
నిలదీశారు.
ప్రచారంలో మాట్లాడుతూ
ఆరేండ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అల్లర్లు
సృష్టించేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
బీజేపీ నాయకులు దిగజారి, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్లో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసేందుకు టీఆర్ఎస్
కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు కావలసిన
సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విధంగా చూస్తామని తెలిపారు.