ఆవుల మందపై ఆరు పులుల దాడి... భయాందోళనకు గురైన గ్రామస్థులు
By: chandrasekar Tue, 08 Sept 2020 2:07 PM
ఆవుల మందపై ఆరు పులులు
దాడి చేయడంతో ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపరితోపాటు విషయం తెలిసిన గ్రామస్థులు
భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేటకు చెందిన పశువుల
కాపరి రాజయ్య సోమవారం ఉదయం పశువుల మందతో శివారులోని బగుళ్లగుట్టపైకి వెళ్లాడు. ఒక్కసారిగా
ఆరు పులులు వచ్చి పశువుల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో ఒక ఆవు మృత్యువాత పడగా మరో
ఐదు గాయపడ్డాయి. రాజయ్య భయంతో అరుపులు, కేకలు వేయగా పులులు పారిపోయాయి.
గుట్టపైనుంచి అరుపులు
వినిపించడంతో సమీపంలో ఉన్న రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్, అటవీ శాఖ అధికారులు బగుళ్లగుట్టపైకి వెళ్లి గాలించగా
ఎట్టకేలకు రాజయ్య కనిపించాడు. అతడిని తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ ఒక
ఆవు కళేబరం కన్పించింది. పులుల దాడికి భయపడ్డ ఆవులన్నీ అడవిలోకి ఒక్కోటి ఒక్కో
వైపు వెళ్లిపోయాయి. ఆరు పులులు ఉన్న విషయాన్ని అటవీ అధికారులు ధ్రువీకరించలేక
పోతున్నారు.