గ్రేటర్ ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయాలకు పాల్పడుతుందన్న విజయశాంతి
By: chandrasekar Thu, 19 Nov 2020 10:30 AM
గ్రేటర్ ఎన్నికలపై
టిఆర్ఎస్ ఓట్ల రాజకీయాలకు పాల్పడుతుందని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు సాయం పేరిట
ఓట్ల రాజకీయాలకు పాల్పడుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి
విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వరదసాయంపై ఆమె మాట్లాడుతూ వరద సాయం
కోసం మీ సేవ ముందు క్యూలో నిల్చుని ఒక మహిళ చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేటర్ ఎన్నికలు 2 వారాలే ఉన్న నేపథ్యంలో మీసేవా కేంద్రాల ముందు
బాధితుల్ని వందల సంఖ్యలో నిలబెట్టి ఊపిరాడకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం
చేసింది. ఈ విషయమై తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా విజయశాంతి స్పందించారు.
గ్రేటర్ హైదరాబాదులో భారీ వర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సాయం
పేరిట కేసీఆర్ దొరగారి సర్కారు ఓట్ల రాజకీయానికి పాల్పడిందనడం కాదనలేని సత్యం.
భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు
పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయింది.
వరద బాధిత పరిహారం కూడా
అపహాస్యం పాలైంది. టీఆరెస్ నేతలు సూచించినవారికి మాత్రమే అదీ చాలావరకూ అరగొరగా
ఇచ్చి నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారు. బల్దియా ఎన్నికలు కేవలం 2
వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు
చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా
కారణమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే
ప్రయత్నమే. టీఆరెస్ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద
సాయం ఆపమని ఆదేశిస్తే ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామనడం
‘అడలేక మద్దెల ఓడు’ అన్నట్టుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఇదంతా ప్రభుత్వం
చేతగానితనం కంటే గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల
కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓటర్లు
కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు అని విజయశాంతి తన
ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. ఎన్నికల సమయం కావడంతో ఈ వ్యాఖ్యలు ప్రత్యేకత
సంతరించుకుంది.