Advertisement

  • సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంపై పేస్ బుక్ ద్వారా స్పందించిన విజయశాంతి

సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంపై పేస్ బుక్ ద్వారా స్పందించిన విజయశాంతి

By: chandrasekar Fri, 04 Sept 2020 6:36 PM

సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంపై పేస్ బుక్ ద్వారా స్పందించిన విజయశాంతి


సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంపై పేస్ బుక్ ద్వారా విజయశాంతి స్పందించారు. గత కొన్ని రోజులుగా తన ఉనికిని చాటుకుంటున్న ప్రముఖ సినీ న‌టి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌శాంతి త‌న సోష‌ల్ మీడియా ద్వారా సుశాంత్ కేసు విష‌యంలో స్పందించారు. కొద్ది రోజులుగా సుశాంత్ మ‌ర‌ణానికి సంబంధించి సీబీఐ, ఈడీ, ఎన్సీబీలు ప‌లు విచార‌ణలు చేస్తుండ‌డం, మీడియాలో దీనిపై డిబెట్‌లు జ‌రుగుతున్న‌ నేప‌థ్యంలో విజ‌య‌శాంతి త‌న ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ మరణించిన తరువాత అతని కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. అతని అభిమానులు అతని మరణంపై సోషల్ మీడియాలో అత్యంత ఉద్వేగంతో స్పందిస్తున్నారు.

అతని మరణంపై పూర్తిగా విచారించి నిజాలను వెలుగులోకి తేవాలని అందరూ ఎదురుచూస్తున్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి అంటూ విజ‌య‌శాంతి పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పారు.

Tags :

Advertisement