వంద రోజుల తర్వాత ఆ దేశంలో మళ్ళీ కరోనా పాజిటివ్..
By: Sankar Sat, 25 July 2020 8:20 PM
వియత్నాంలో గత 100 రోజుల వ్యవధిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సెంట్రల్ డానాంగ్ నగరానికి చెందిన 57 ఏండ్ల వ్యక్తి జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో గురువారం ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారని వియత్నాం ఆరోగ్యశాఖ తెలిపింది.
బాధితుడు గత నెలరోజులుగా నగరం దాటి బయటకు వెళ్లలేదని, అయినా అతనికి కరోనా ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని, అతనికి వైరస్ ఎలా సంక్రమించిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అతనితో ఈ మధ్య కాంటాక్ట్ అయిన 105 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని వియత్నాం అధికారులు తెలిపారు. అదేవిధంగా వియత్నాంలో గత 100 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసుతో కలిపి వియత్నాంలో మొత్తం కేసుల సంఖ్య 416కు చేరిందన్నారు.