భక్తులకు గుడ్ న్యూస్ : తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
By: Sankar Sun, 16 Aug 2020 08:34 AM
జమ్మూకశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు.
కాగా ఈ పుణ్య క్షేత్రాన్ని సందర్శించేందుకు అనేక మంది పర్యాటకులు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఈ ఆలయం ఉంది. జమ్ము - కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ము నుండి ఈ ఆలయానికి 65 కిలోమీటర్ల దూరం. జమ్ము నుండి కత్రా వరకూ 50 కిలోమీటర్లు హెలికాప్టర్లలో వెళ్లి... మిగతా దూరం కాలి నడకన లేదా, గుర్రాల మీద, పల్లకిలో ఎలా అయినా వెళ్లవచ్చు. కత్రా నుండి ఆలయానికి 15 కిలోమీటర్ల దూరం.