వాటిని అభివృద్ధి చేసినట్లు దుబ్బాకను ఎందుకు చేయలేదు...తెరాస ను ప్రశ్నించిన ఉత్తమ్
By: Sankar Sun, 01 Nov 2020 10:19 AM
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్న కేసీఆర్, హరీశ్, కేటీఆర్లు దుబ్బాకను ఎందుకు పట్టించు కోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. రామలింగా రెడ్డి దుబ్బాకలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేశారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయ లేకపోతున్నానని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు.
శనివారం దుబ్బాక నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నా అధి కారులు తనకు సహకరించడం లేదని రామ లింగారెడ్డి అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేశా రని చెప్పారు. నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, హరీశ్రావు ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అలాంటి హరీశ్ ఏం మొహం పెట్టుకుని దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుపై రేప్ కేసు ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీశ్రావు–రఘునందన్రావు ఒకే సామాజిక వర్గం వారని, ఇద్దరూ బంధువులని తెలిపారు. రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. దుబ్బాకను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని, ఏ గ్రామానికి వెళ్లినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు.