కరోనాకు చికిత్సలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్న అమెరికా పరిశోధకులు
By: chandrasekar Fri, 07 Aug 2020 11:46 AM
కరోనా వైరస్ ప్రపంచాన్నే
భయపెడుతున్నది. కరోనా పాజిటివ్ కేసుల్లో యూఎస్ఏ, బ్రెజిల్, భారత్
వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ
మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతోమంది
చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఇంకా
రాలేదు.
కాగా, అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు
కరోనాను అడ్డుకునేందుకు చేసిన అధ్యయనం ఫలించినట్లే కనిపిస్తుంది. కరోనా వైరస్ మన
శరీరంలోకి చొరబడకుండా చేసే ఓ చికిత్సా పద్ధతిని వారు కనుగొన్నారు. కొత్త ఆశలను
రేకెత్తిస్తున్న వారి అధ్యయన వివరాలు సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ జర్నల్లో
ప్రచురించారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం,
‘3సీఎల్పీఆర్వో’ అని పిలువబడే కరోనావైరస్ 3సీలాంటి ప్రోటీసెస్ (ప్రొటీన్ను విచ్ఛిన్నం చేసే
ఎంజైమ్) మానవ శరీరంలో వైరస్ ప్రతిరూపణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కాగా, ఆప్టిమైజ్ చేసిన కరోనావైరస్ ‘3సీఎల్పీఆర్వో’ ఇన్హిబిటర్స్ను వాడి కరోనా వైరస్
వ్యాప్తికి కారణమైన సార్స్ సీఓవీ-2 ను
కణాల్లోకి చేరకుండా నిరోధించవచ్చని నిర్ధారించారు. ఇలాంటి శ్రేణి సమ్మేళనాలను కరోనా చికిత్సకు
ఉపయోగించవచ్చని కనుగొన్నారు.