Advertisement

భారత్‌, చైనాతో చర్చలు జరుపుతున్న అమెరికా

By: chandrasekar Mon, 22 June 2020 11:49 AM

భారత్‌, చైనాతో చర్చలు జరుపుతున్న అమెరికా


భారత్‌-చైనాల నెలకున్న సరిహద్దు ఉద్రిక్తతల్ని పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. మేం భారత్‌, చైనాతోనూ చర్చిస్తున్నాం. ఇరువురి మధ్య పెద్ద సమస్య తలెత్తింది. ఇటీవల తీవ్ర ఘర్షణకు దిగారు. ఏం జరుగుతుందో చూడాలి. సమస్యను పరిష్కరించుకునేలా మేం వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం’ అని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌-చైనా మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ట్రంప్‌ యంత్రాంగంలోని ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖ కాంగ్రెస్‌ సభ్యులు భారత్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణపై వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. చైనా కుట్రలను బయటపెడుతూ భారత్‌కు మద్దతుగా నిలిచారు. చైనా వైఖరిని బాహటంగానే ఆరోపించారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై దృష్టిసారించిన వేళ ఇదే తరుణంగా భావించిన చైనా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోందని డ్రాగన్‌ దుర్నీతిని ఎండగట్టారు. భారత్‌ వెంబడి ఉన్న సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు చైనా సైన్యం ఆజ్యం పోస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో సైతం దుయ్యబట్టారు. చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీని ‘ధూర్త శక్తి’గా ఆయన అభివర్ణించారు. దక్షిణ చైనా సముద్రంలోనూ సైనిక కార్యకలాపాలను డ్రాగన్ మరింత ముమ్మరం చేసిందని ఆరోపించారు. సముద్ర మార్గాలను ప్రమాదంలో పడేస్తోందని, హాంకాంగ్‌లో స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని శుక్రవారం కోపెన్‌హాగన్ ప్రజాస్వామ్య సదస్సు 2020 సందర్భంగా ‘యూరప్ చైనా ఛాలెంజ్’పై తన వర్చువల్ ప్రసంగంలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు.

వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కైలీ మెక్‌నానీ మాట్లాడుతూ భారత్, చైనా సరిహద్దుల్లో నెలకున్న ఉద్రిక్తతల గురించి అధ్యక్షుడు ట్రంప్‌నకు తెలుసని, పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని అన్నారు. జూన్ 2న ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన ట్రంప్ భారత్-చైనా సరిహద్దుల్లో నెలకున్న పరిస్థితుల గురించి చర్చించారన్నారు. ట్రంప్, మోదీ మధ్య అద్భుతమైన సంబంధాలు, పరస్పర నమ్మకం ఉన్నాయని ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ ఉపాధ్యక్షుడు అల్ మాసన్ ప్రకటించారు.

Tags :
|
|
|

Advertisement