ఎర్లీ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఓట్ వేస్తున్న అమెరికన్లు ...
By: Sankar Wed, 28 Oct 2020 07:34 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.87 కోట్ల మంది ఎర్లీ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎర్లీ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కౌంటింగ్ ఆలస్యమయి, రిజల్టు లేటవుతుంటుంది.
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎర్లీ బాలెట్లు కూడా పెరిగాయని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఎక్కువమంది ఓటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. అమెరికాలో సుమారు 24 కోట్లమంది ఓటర్లు ఈ దఫా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని యూఎస్ఏ టుడే తెలిపింది. ఇప్పటివరకు ఎర్లీ ఓటు ఉపయోగించుకున్నవారిలో డెమొక్రాట్ మద్దతుదారులు అధికమని(70 శాతం) నివేదిక తెలిపింది.
ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలైన 3వతేదీ అనంతరం వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని సీఎన్ఎన్ మరో నివేదికలో తెలిపింది. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువని పేర్కొంది. ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది.