ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ ...అభినందించిన అమిత్ షా
By: Sankar Mon, 19 Oct 2020 5:18 PM
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. లక్ష్మణ్కు హోంమంత్రి అమిత్షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు.
ఇక కనీసం ప్రగతి భవన్ కూడా దాటని సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగినట్టు తెలిపారు.