- హోమ్›
- వార్తలు›
- ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్..కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర
ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్..కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర
By: Sankar Wed, 19 Aug 2020 6:35 PM
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్ఆర్ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది.
ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాయి. ఇక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఈ ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ డెవలపర్కు అప్పగించడం ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ఈ మూడు ఎయిర్పోర్ట్ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం డెవలపర్గా అదానీ గ్రూప్ను ఎంపిక చేసింది