నల్గొండ జిల్లాలో విషాదం ... బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి
By: Sankar Wed, 18 Nov 2020 8:58 PM
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్ శివారులో మిర్యాలగూడ - సాగర్ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలివి.. పెద్దవూర మండలం బోనుతల గ్రామానికి చెందిన ఒట్టే నరేశ్ (24), హాలియా పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన జావిద్ (25) వ్యక్తిగత పనులపై సాయంత్రం బైక్పై మిర్యాలగూడ వైపు నుంచి హాలియా వైపు వెళ్తున్నారు.
బొక్కమంతల పహాడ్ శివారు మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. అతివేగం కారణంగా బైక్ నేలను బలంగా ఢీకొనడంతో శరీరంలో అంతర్గత అవయవాలు దెబ్బతిని ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. ఎస్ఐ కొండల్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.