ఇంట్లో ప్రేమ వ్యవహారం తెలిసింది అని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
By: Sankar Wed, 12 Aug 2020 11:12 AM
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ సియోని జిల్లాలోని కొంద్రా గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు యువకులతో ప్రేమలో పడ్డారు. యువతుల వయసు ఒకరిది 18 కాగా, మరొకరిది 16. అయితే వీరిలో ఒకరి బాయ్ఫ్రెండ్.. తాను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఆమె తండ్రికి మేసేజ్ పంపాడు. ఈ సందేశాన్ని ఇంట్లో వారంతా చూశారు. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తీవ్ర ఒత్తిడికి లోనైన ఇద్దరు యువతులు గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాళ్ల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేసేజ్ పంపిన బాయ్ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.