బాలికపై సామూహిక లైంగిక దాడి కేసులో ఇద్దరికీ మరణశిక్ష
By: Sankar Fri, 16 Oct 2020 2:39 PM
ఉత్తరప్రదేశ్లోని హపూర్ జిల్లాలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన 12ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి, హత్యకేసులో గురువారం కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఇద్దరు నిందితులకు ప్రత్యేక కోర్టు జడ్జి (పోక్సో చట్టం) వీణ నారాయణ్ మరణశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.
బాలిక తమ్ముడు కేసులో ప్రధాన సాక్షి అయ్యాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరేంద్ర త్యాగి తెలిపారు. ఘటనకు కొన్నినెలల ముందు నిందితులు అంకుర్ తేలి, సోను బాలిక ఇంట్లో పనికి చేరారు. సెప్టెంబర్ 9, 2018న బాలిక తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లగా బాలికతోపాటు ఆమె తమ్ముడు(10) ఒంటరిగా ఉన్నారు. బాలికపై ఇద్దరు లైంగికదాడికి యత్నిస్తుండగా ఆమె తమ్ముడు అలారం మోగించేందుకు ప్రయత్నిస్తుండగా అతడి గొంతుకోశారు. చనిపోయాడని భావించి వదిలేసి బాలికపై లైంగికదాడి చేసి చంపి సమీపంలోని గోడౌన్లో మృతదేహాన్ని దాచారు.
ఇంటికి వచ్చిన తండ్రికి రక్తపు మడుగులో కుమారుడు కనిపించడంతో హుటాహుటిన దవాఖానకు తరలించాడు. కోలుకున్న అతడు ఏం జరిగిందో తల్లిదండ్రులకు చెప్పాడు. బాలిక మృతదేహాన్ని గోడౌన్లో గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి అక్టోబర్ 28న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
భౌతిక, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా 18 మంది సాక్షులను కోర్టులో హాజరుపర్చారు. వాదోపవాదాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసులో అమర్ జీత్ అనే మరోవ్యక్తిని నేరస్తుడిగా గుర్తించినా సరైన సాక్ష్యాధారాలు లభించనందున అతడిని నిర్దోషిగా కోర్టు పేర్కొందని ఎస్పీ సర్వేశ్ మిశ్రా తెలిపారు.