చైనా కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల ధర రూ.10,800...!
By: chandrasekar Sat, 22 Aug 2020 02:30 AM
చైనా కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తో౦ది. ఆ వ్యాక్సిన్ ధరను 1000 యువాన్లుగా (
144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ తయారుచేస్తోన్న వ్యాక్సిన్కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. సినోఫార్మ్ తయారు చేస్తోన్న ఈ కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల ధర రూ.10,800
వరకు ఉండవచ్చునని ఆ కంపెనీ చైర్మన్ లీ జింగ్జెన్ తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాక్సిన్ యూఏఈలో చివరి దశ ప్రయోగాల్లో ఉందన్న లీ జింగ్జెన్ ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని అన్నారు. ఒక డోస్ అయితే కొన్ని వందల యూవాన్స్ అవుతుందని అదే రెండు డోసులు ఐతే, 1,000 యువాన్స్ లోపు ఉంటుందని చెప్పిన జింగ్జెన్ అదేమీ అంత ఎక్కువ ధర కాదని కూడా అంటున్నారు.
చైనాకు చెందిన గాంగ్మింగ్ అనే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జింగ్జెన్ ఈ వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ రెండు డోసుల ధర సుమారు రూ.2,800 ఉండవచ్చునని తెలుస్తుండగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసే కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల ధర సుమారు రూ.600
లోపే ఉంటుందని సమాచారం. ఇక ఐసిఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ని అంతకంటే తక్కువ ధరకే అందిస్తామని భారత్ బయోటెక్ ఎమ్డీ కృష్ణ ఎల్ల ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్కే ఎక్కువ ధర చెబుతుండటం గమనించదగ్గ విషయం.