- హోమ్›
- వార్తలు›
- టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ - ట్విట్టర్ డీల్ - భారతీయుల చేతుల్లోకి ఎపుడొస్తుందో...
టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ - ట్విట్టర్ డీల్ - భారతీయుల చేతుల్లోకి ఎపుడొస్తుందో...
By: Dimple Sun, 09 Aug 2020 5:55 PM
ఆండ్రాయిడ్ ఫోన్లలో మారుమూల గ్రామాలకు పరిచయమైన టిక్ టాక్.. మళ్లీ భారతీయుల చేతుల్లో కన్పించబోతోంది. సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన టిక్ టాక్ను దక్కించుకోడానికి దిగ్గజ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టిక్ టాక్ కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని కోట్లకు కోట్లు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఒక భారీ విలీనానికి తెరలేపింది. చైనాలోని బైట్డ్యాన్స్కు చెందిన ‘టిక్టాక్’ను ట్విటర్లో విలీనం చేసుకొనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు ప్రముఖ ఆంగ్లవార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ఇది కేవలం టిక్టాక్ అమెరికా కార్యకలపాలకు సంబంధించే ఉంటుందా మరేదైనా అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కూడా టిక్టాక్ను దక్కించుకొనే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్-బైట్ డ్యాన్స్(చైనా)కు చర్చలు మొదలైయ్యాయి. ఈ విషయాన్ని గత వారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు వెల్లడించారు. టిక్టాక్ మాత్రం ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించింది. దీంతో ఈ డీల్ విషయంలో తనకంటే ఎంతో పెద్దదైన మైక్రోసాఫ్ట్తో ట్విటర్ పోటీపడగలదా అనేది ప్రశ్నార్థకమైంది. ట్విటర్ మార్కెట్ విలువ 29 బిలియన్ డాలర్లు.. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ విలువ 1.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
భారత ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి సమాధానాలను సమర్పించామని టిక్టాక్ యాప్ ఇండియా అధిపతి నిఖిల్ గాంధీ తెలిపారు. అలాగే కేంద్రం వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అధికారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ తన బ్లాగ్పోస్ట్లో తెలిపారు. జాతీయ భద్రత, గోప్యతా సమస్యల దృష్ట్యా గతనెలలో టిక్టాక్తో సహా 59 చైనా యాప్లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. నిషేధం నాటికి మనదేశంలో సుమారు 200 మిలియన్ మంది టిక్టాక్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ గణాంకాలు చెబుతున్నాయి.
డేటా గోప్యత, భద్రతలతో సహా యాప్కు సంబంధించిన ప్రతి అంశం భారత చట్టాలకు లోబడే ఉన్నాయని గాంధీ మరోసారి తెలిపారు. భారత్లో టిక్టాక్ యాప్ వినియోగదారుల సమాచారాన్ని ఏ దేశ ప్రభుత్వంతోనూ పంచుకోలేదని, భారత సమగ్రతన దెబ్బతీసే ఎలాంటి ఫ్యూచర్ను యాప్లో వాడలేదన్నారు.‘‘టిక్టాక్ యాప్ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్టిస్టులు, కథకులు, అధ్యాపకులు, ప్రదర్శకులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతంగా జీవనోపాధిని కల్పించుకోవడంతో పాటు అనేకమంది జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తన కృషిచేశారు. భారత్లోని కస్టమర్లకు టిక్టాక్ను అందుబాటులోకి తెచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తాం’’ అని నిఖిల్ గాంధీ తెలిపారు.