ట్విటర్ యాజమాన్యమే మెచ్చుకున్నా ఎనలిస్ట్ షామికా
By: chandrasekar Fri, 29 May 2020 5:25 PM
ప్రపంచ వ్యాప్తంగా ఏ
మాధ్యమంలో చూసినా కొవిడ్ గణాంకాలే పెరుగుతూ, తగ్గుతూ
జనాల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో షామికా రవి ట్విటర్లోకి తొంగి చూస్తే స్పష్టత
వచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం లేదు. సాక్షాత్తు ట్విటర్ యాజమాన్యమే
ప్రకటించింది. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగ్గ 29 ట్విటర్ ఖాతాలలో ఒకటిగా షామికా రవికి కితాబు
ఇచ్చింది. షామికా రవి ఢిల్లీకి చెందిన ఆర్థికవేత్త. న్యూయార్క్ విశ్వవిద్యాలయం
నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అక్కడి ప్రఖ్యాత బ్రోకింగ్ సంస్థలో డైరెక్టర్గా
పనిచేసిన అనుభవమూ ఉంది. 15 ఏండ్ల
క్రితం ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. దశాబ్దకాలానికి పైగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్'లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్, ఉపాధి హామీ చట్టాల మీద ఆమెకు అపారమైన పరిజ్ఞానం ఉంది.
క్లాసులు, వ్యాసాలు, సెమినార్లు, అధ్యయనాలు షామికాకు క్షణం కూడా తీరిక ఉండదు.
మనందరిలాగే ఆమె జీవితాన్ని కూడా కరోనా కుదిపేసింది. లాక్డౌన్ ఇంటికే పరిమితం
చేసింది. కరోనా గురించి వస్తున్న
గణాంకాలని చూసి ఆమె కూడా కంగారుపడ్డారు. తర్వాత వాటిని విశ్లేషించడం
ప్రారంభించారు.
‘రోగి
శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎంతకాలానికి కరోనా బయటపడుతుంది ఈ వైరస్ మన దేశంలో
ఎలా ప్రవర్తిస్తున్నది తదితర సమాచారం ఏదీ మన దగ్గర లేదు. అందుకనే ఉన్న వివరాలతో వైరస్ తీరును విశ్లేషించే
ప్రయత్నం మొదలుపెట్టాం’ అంటారు షామికా.
వైరస్ ఎన్ని రోజులకు
ఓసారి రెట్టింపు అవుతున్నది మిగతా దేశాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం లాంటి వివరాలతో అనేక నివేదికలను తయారు చేస్తున్నారు.
శాస్త్రీయ పద్ధతులలో గణాంకాలను విశ్లేషించి, గ్రాఫ్లను
రూపొందించి ట్వీట్ల ద్వారా విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు.
ప్రముఖ దినపత్రికలు కూడా
ఆమె అంచనాలను, గ్రాఫ్లను
ఉపయోగించుకుంటున్నాయి. ప్రభుత్వం సైతం కొవిడ్ కమిటీలలో స్థానం కల్పించింది. లాక్డౌన్కు
ఆమె మద్దతు ఇచ్చినా, వలస
కార్మికుల విషయంలో మాత్రం ప్రభుత్వం మరింత చేసి ఉండాల్సిందంటూ తన నిరసన గళాన్ని
వినిపించారు. వ్యాక్సిన్ వచ్చేవరకూ వైరస్తో కలిసి బతకాల్సిందేనని తేల్చి
చెబుతున్నారు.