భారత్ ను క్షమాపణలు కోరిన ట్విట్టర్... ఎందుకో తెలుసా !
By: Sankar Wed, 18 Nov 2020 10:09 PM
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విటర్ తాను చేసిన తప్పిదానికి భారత్ను లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరింది. బుధవారం బీజేపీ ఎంపీ మినాక్షి లేఖీ నేతృత్వంలోని జేపీసీ ముందు ట్విటర్ ప్రతినిధులు హాజరైన క్షమాపణలు చెప్పారు.
ఈ సందర్భంగా మీనాక్షి లేఖీ మీడియాతో మాట్లాడుతూ.. లడఖ్ను చైనా భూభాగంలో చూపించినందుకు ట్విటర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరిందని చెప్పారు. భారత పటాన్ని తప్పుగా జియో ట్యాగింగ్ చేయడంపై ట్విటర్ ఇండియా మాతృసంస్థ అమెరికా ఐఎన్సీ చీఫ్ ప్రైవసి ఆఫిసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారని తెలిపారు. లడఖ్ను చైనా భూభాగంలో చూపించి భారతీయుల మనోభవాలను దెబ్బతీసినందుకు తమ తప్పును ఈ నెల 30వ తేదీ నాటికి సవరించుకుంటామని హామీ ఇచ్చినట్లు మీనాక్షి లేఖీ వెల్లడించారు..
కాగా ఇటీవల ట్విటర్ చైనాకు సంబంధించిన ఓ పోస్టు చేస్తూ లడఖ్ను చైనా భుభాగంలో చూపించింది. దీంతో ట్విటర్ తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించేలా వ్యవహరించిందని పేర్కొంది. అంతేగాక దీనిని దేశ ద్రోహంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.