పీటల మీదికొచ్చేసరికి పెళ్లికొడుకు ట్విస్ట్...
By: chandrasekar Sat, 05 Dec 2020 10:41 PM
వధూవరులు ఒకరినొకరు
ఇష్టపడి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకుని పెళ్లి నిశ్చయించారు. అయితే పీటల
మీదికొచ్చేసరికి పెళ్లికొడుకు ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి వద్దే వద్దన్నాడు.. దీంతో
పెళ్లి నిలిచిపోయింది. ఈ సంఘటన శుక్రవారం బోధన్ పట్టణ కేంద్రంలో జరిగింది.
బోధన్ పట్టణంలోని శక్కర్నగర్
కాలనీకి చెందిన యువకుడికి రాకాసీపేట్కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ఇరువురికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.
శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాలతో పాటు బంధువులు పెళ్లి కూతురు, పెళ్లి
కొడుకు చర్చికి చేరుకున్నారు.
చర్చిలో ఫాదర్
మాట్లాడుతూ నీకు అబ్బాయి ఇష్టమా అని అడగగా అమ్మాయి ఇష్టమే అని చెప్పింది. కాని
అక్కడే అబ్బాయి మొహం చాటేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో
పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు, పెళ్లి కొడుకు తరపు
బంధువులు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లికూతురు తరపు పెద్దలకు ఆగ్రహం కట్టలు
తెంచుకుంది.
పెళ్లి నిరాకరణపై
ఇరువర్గాల వారు పెళ్లికొడుకును ఎంత సముదాయించినా, మందలించినా ఎలాంటి
సమాధానం రాకపోయేసరికి చివరికి పెళ్లిపెద్దలు మాట్లాడుకుని వివాహం క్యాన్సిల్
చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.