- హోమ్›
- వార్తలు›
- లాక్ డౌన్లో టీవీలకు అతుక్కుపోయిన జనాలు ..ఎక్కువగా న్యూస్ చానెల్స్ చూసినట్లు సర్వే లో వెల్లడి
లాక్ డౌన్లో టీవీలకు అతుక్కుపోయిన జనాలు ..ఎక్కువగా న్యూస్ చానెల్స్ చూసినట్లు సర్వే లో వెల్లడి
By: Sankar Tue, 28 July 2020 10:19 AM
దాదాపు 100 రోజుల లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలు డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయారు. టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లే లోకంగా గడిపేశారు. వినోదానికి పెద్దపీట వేశారు. లాక్డౌన్ ప్రకటించిన మొదటివారంలోనే టీవీ వీక్షకుల సంఖ్య 15% పెరిగిందని బార్క్, నీల్సన్ సర్వే వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో గరిష్ఠంగా వీక్షకుల సంఖ్య 43% పెరిగింది. ఆ సంఖ్య 36.3 కోట్లకు చేరింది. వీరిలో ఎక్కువమంది వార్తా చానళ్లవైపు మొగ్గు చూపారు.
కొవిడ్ ముందుతో పోల్చితే న్యూస్ చానళ్ల వీక్షకులు రెట్టింపయ్యారని అంచనా. లాక్డౌన్కు ముందు వినోదాత్మక చానళ్లు రాజ్యమేలేవి. సీరియళ్లు, రియాలిటీ షోలు దుమ్మురేపేవి. ఫలితంగా మొత్తం వీక్షకుల్లో 68% వరకు ఎంటర్టైన్మెంట్ చానళ్లే చూసేవారు. షూటింగ్లు ఆగిపోవడంతో కొత్త ఎపిసోడ్లు రాలేదు. పాతవాటినే తిప్పితిప్పి వేశారు. దీంతో వీక్షకుల సంఖ్య 47% వరకు పడిపోయింది.
ఇక అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, వూట్, ఆల్ట్బాలాజీ వంటి ఓటీటీ (ఓవర్ ద టాప్) సర్వీసులు లాక్డౌన్ సమయంలో టాప్గేర్లో దూసుకుపోయాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ వినియోగదారుల సంఖ్య 60% వరకు పెరుగగా, దేశీయ ఓటీటీలకు 100% పెరుగుదల ఉన్నది. యానిమేషన్కు ఆదరణ అదిరింది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీ5 కిడ్స్, వూట్కిడ్స్ వంటి ఓటీటీల వీక్షకుల సంఖ్య 200% పెరిగింది.
లాక్డౌన్లో ఇంటర్నెట్ వినియోగం 60-70% వరకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 57.4 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఈ ఏడాది చివరినాటికి ఆ సంఖ్య 63 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో 27 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. 2019తో పోల్చితే పల్లెల్లో 45 శాతం వినియోగం పెరుగగా, పట్టణాల్లో ఇది 11 శాతంగా నమోదైంది. నగరాల్లో లాక్డౌన్లో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు 40% వరకు పెరిగారు