తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్న టీటీడీ...
By: chandrasekar Mon, 30 Nov 2020 7:56 PM
తిరుమల తిరుపతి దేవస్థానం
పవిత్ర తిరుమల కొండల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో
తిరుమల కొండలను జీరో కార్బన్ ఎమిషన్ జోన్గా మార్చే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను
తిప్పాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రయాణించేందుకు ఆంధ్రప్రదేశ్
రోడ్డు రవాణా సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుందని టీటీడీకి
చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో వీటిని
నడుపనున్నట్టు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో అన్నారు.
తిరుమల కొండలపై
ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీటీడీ చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తొలుత
సుమారు 100 నుంచి
150
బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులో తీసుకువస్తుందని తెలిపారు. ఇంకా ఇటీవల తిరుమలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి
సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ
ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల వేంకటేశ్వరస్వామివారి
ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని నిర్ణయించినట్టు
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇందులో
భాగంగా డిసెంబరు 25వ తేదీ వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల
పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. పేద ప్రజలకు
వివాహాలు ఆర్థికభారాన్ని మిగల్చకుండా ఉండేందుకు వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో
గతంలో అమలుచేసిన కల్యాణమస్తు సామూహిక వివాహ కార్యక్రమాన్ని
పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కొండపై డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300ల
ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఉదయం విడుదల
చేసింది. రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వివిధ
స్లాట్లలో టికెట్ల జారీ జారీ ఉంటుందనీ రోజూ 19 వేల టికెట్లను భక్తులకు ఇస్తామని టీటీడీ అధికారులు
పేర్కొన్నారు.