భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ ...టికెట్ రద్దు చేసుకుంటే రిఫండ్ అవకాశం
By: Sankar Thu, 29 Oct 2020 07:29 AM
దర్శన టికెట్ల రద్దు, రీఫండ్కు టీటీడీ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ ఏడాది మార్చి 13 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్ కౌంటర్ల ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది.
టికెట్ వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ను ఎక్సెల్ ఫార్మాట్లో [email protected] మెయిల్ ఐడీకి పంపాలి. కాగా, టీటీడీ 2021 డైరీలు, క్యాలెండర్లను www.tirupatibalaji.ap.gov.in ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే, తిరుమల నాదనీరాజనం వేదికపై నవంబర్ 3 నుంచి ఆరో విడత సుందరకాండ అఖండ పారాయణాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
అయితే టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31 లోపు వారికి అనువైన సమయంలో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది.