అమెరికా గొప్పతనాన్ని బైడెన్ ధ్వంసం చేస్తారన్న ట్రంప్
By: chandrasekar Fri, 28 Aug 2020 2:08 PM
రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో.. ఒకవేళ డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ బైడెన్ గెలిస్తే .. అప్పుడు అమెరికా స్వప్నాలకు ప్రమాదం వస్తుందన్నారు. అమెరికా స్వప్నాలను బైడెన్ నాశనం చేస్తారని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా గొప్పతనాన్ని బైడెన్ ధ్వంసం చేస్తారన్నారు.
డెమోక్రాట్లు గెలిస్తే హింసాత్మక అరాచకవాదులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందన్నారు. అమెరికా ఓటర్లు తనను మరో నాలుగేళ్ల కోసం ఎన్నుకోవాలని ట్రంప్ అభ్యర్థించారు. వైట్హౌజ్లోని సౌత్ లాన్లో జరిగిన కార్యక్రమంలో.. పార్టీ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ స్వీకరించారు.
అమెరికా స్వప్నాన్ని రక్షించుకునే అంశం రాబోయే ఎన్నికల్లో తేలనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. చట్టాలకు కట్టుబడి ఉండే అమెరికన్లు రక్షించబడాంటే మీ ఓటు కీలకం అని అన్నారు. లేదంటే అరాచకవాదులు, ఆందోళనకారులు, నేరస్తులు పౌరులను ఇబ్బంది పెడుతుంటారన్నారు.
అమెరికాలో ఇటీవల ఓ నల్లజాతీయుడు మృతిచెందిన ఘటన తర్వాత భారీ ఎత్తును నిరసనలు వెల్లువెత్తాయి. ఆ ఆందోళనల్లో హింస చోటుచేసుకున్నది. ఆ ఘటనలను ప్రస్తావించిన ట్రంప్.. అరాచకవాదులకు అవకాశం ఇవ్వకూడదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3వ తేదీన జరగనున్నాయి.