పేరు మారిస్తే ఏమొస్తది ..పురోగతి కావాలి ...మంత్రి కేటీఆర్
By: Sankar Mon, 30 Nov 2020 05:26 AM
పేరు మార్పు కాదు పురోగతి కావాలి, నగర రూపురేఖలు మార్చాలి. పనితీరు మారాలి’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన పనులను ప్రజల ముందు పెట్టాం.
అభివృద్ధిని కొనసాగించేందుకు మరోమారు ఓటు వేయమని కోరాం. ఎక్స్అఫీషియో ఓట్ల అవసరం లేకుండా... టీఆర్ఎస్ కార్పొరేటర్ల మెజారిటీతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకుం టుంది. ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లలో కాస్త అటూఇటుగా ఫలితం సాధిస్తాం. బీజేపీకి దేశ ప్రధాని పదవి అప్పగిస్తేనే మార్పు సాధ్యం కాలేదు. గ్రేటర్ మేయర్ పదవి ఇస్తే ఏం మారుస్తారు. ఇలాంటి వారితో కొట్లాడటం మా దౌర్భాగ్యం’ అని కేటీఆర్ అన్నారు..
తెలంగాణలో బీజేపీ పోటీ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆరు లోక్సభ స్థానాల్లో గెలిచింది. అడపాదడపా బీజేపీ కొన్ని చోట్ల గెలుస్తున్నా స్థిరంగా ఫలితాలు సాధించడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను బలంగా చొప్పించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను హైదరాబాద్ ప్రజలు తిరస్కరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. గతంలో కేంద్రంలో బీజేపీకి పలు సందర్భాల్లో అంశాల వారీగా మేము మద్దతు ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో ఎంఐఎం మాకు మద్దతు పలికింది. ఎంఐఎంతో మాకు ఎన్నికల పొత్తు లేదు. మాది సంకీర్ణ ప్రభుత్వం కాదు.