సొంత పార్టీ పైనే విరుచుకుపడ్డ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్
By: chandrasekar Fri, 20 Nov 2020 11:13 AM
జీహెచ్ఎంసీ ఎన్నికల
సందర్భంగా సొంత పార్టీ పైనే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్
విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ
సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో రూ. 68 వేల
కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది. కానీ ఆ
అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు. నగరంలో
ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిర్మించినవి
కాగా ఇటీవల కాలంలో వాటి నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం
నిజంగానే అభివృద్ధి పనులు చేసి ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ఉంటుందని డి
శ్రీనివాస్ ప్రశ్నించారు.
ప్రజలు తీవ్ర అసంతృప్తితో
ఉన్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలను
నిర్వహిస్తున్న తీరు అతి దారుణంగా ఉందన్న డిఎస్, తాను జీవితంలో ఇలాంటి
ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలు ఎప్పుడైనా
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తే బాగుంటుందని హితవు పలికిన డిఎస్ హైదరాబాద్
వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులకు సాయాన్ని పూర్తిగా అందించిన తర్వాతే
ఎన్నికలు నిర్వహించి ఉండుంటే బాగుండేదని అన్నారు. ఏదేమైనా ఇప్పటికిప్పుడు
హడావుడిగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వ వైఖరిపై
డిఎస్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. దీనివల్ల టీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది.