ఆర్టీసీ ద్వారా ఇంటింటికి కార్గో సర్వీస్
By: Sankar Fri, 11 Dec 2020 10:21 AM
ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా జంట నగరాల్లో సరుకుల హోం డెలివరీ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన కార్యాలయంలో ఈ సేవలను ప్రారంభించారు.
దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరిగే ఏ ప్రాంతం నుంచైనా సరుకులు, పార్శిళ్లను నగరంలో సంబంధిత ఇళ్లకు చేరవేయడానికి అవకాశం కలుగుతుంది. ఇందుకు ఆర్టీసీ కార్గో విభాగం హోం డెలివరీలో అనుభవం ఉన్న డుంజో డిజిటల్, స్మార్ట్యాప్ లాజిస్టిక్స్, అడ్నిగమ్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇక మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థకు రోజుకు రూ.15 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నదని, త్వరలోనే రూ.25 లక్షల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్గో సేవలను జూన్ 19న ప్రారంభించగా అప్పటి నుంచి ఇప్పటిదాకా 12.50 లక్షల పార్సిళ్లను చేరవేసి రూ.11.30 కోట్లు ఆర్జించిందని మంత్రి వెల్లడించారు. ఇదో గొప్ప మైలురాయి అని ఆయన చెప్పారు.