టాలీవుడ్ లో తీవ్ర విషాదం..సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత
By: Sankar Tue, 08 Sept 2020 08:20 AM
టాలీవుడ్ లో మరొక తీవ్ర విషాదం నెలకొంది..ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు..ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో బాత్రూంలోనే కుప్పకూలారు..ఆసుపత్రికి తరలించేలోపే అయన తుది శ్వాస విడిచారు..కాగా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు జయప్రకాష్రెడ్డి.. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు.
తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేటలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆయనకు ఆసక్తి. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.
ఇక, ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. ఇక, 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఓవైపు ప్రతినాయకుడిగా.. మరోవైపు కమెడియన్గా... కొన్నిసార్లు తండ్రిగా.. మామగా.. ఇలా పలు రకాల పాత్రలు పోషించి.. తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు జయప్రకాష్రెడ్డి.