Advertisement

భార్య భర్తల గొడవలో పసిపాప బలి..

By: Sankar Sat, 25 July 2020 8:05 PM

భార్య భర్తల గొడవలో పసిపాప బలి..



ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నోయిడా న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. భార్యాభ‌ర్త‌ల కొట్లాట‌లో అభంశుభం తెలియ‌ని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌కు జంషేద్ బ‌తుకుదెరువు కోసం భార్యాబిడ్డ‌తో క‌లిసి నోయిడాకు వ‌చ్చి జేజే కాల‌నీలో ఉంటున్నాడు. ఇద్ద‌రూ కూలీ పనులు చేసి జీవిస్తున్నారు. ఈ క్ర‌మంలో గురువారం మధ్యాహ్నం భార్య‌భ‌ర్త‌లు గొడ‌వ‌ప‌డ్డారు.

ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన జంషేద్ త‌న చేతిలో ఉన్న చిన్నారిని తీసి భార్య‌పైకి విసిరాడు. ఆ చిన్నారి త‌ల్లికి త‌గ‌ల‌కుండా ప‌క్క‌గా వెళ్లి గోడ‌కు త‌గ‌ల‌డంతో త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. స్థానికుల సాయంతో వెంట‌నే స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా ఢిల్లీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని వారు రిఫ‌ర్ చేశారు. దీంతో ఢిల్లీకి తీసుకెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే పాప ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘ‌ట‌న‌పై జంషేద్ భార్య శ‌నివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Tags :
|
|
|

Advertisement